ఎయిర్టెల్కు భారీ షాక్.. లైసెన్స్ రద్దు!
Updated:
17-12-2017 09:18:21
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్కు ఊహించని షాక్ తగిలింది. ఖాతాదారుల ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్లను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సస్పెండ్ చేసింది.ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పింది. యూఐడీఏఐ నిర్ణయంతో ఎయిర్టెల్ తమ ఖాతాదారుల మొబైల్ నంబర్లను ఆధార్తో అనుసంధానం చేసే అవకాశాన్ని తాత్కాలికంగా కోల్పోయింది. అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త ఖాతాలను తెరవలేదు.
వినియోగదారుల అనుమతితో పనిలేకుండా ఈ-కేవీసీ ద్వారా తమ మొబైల్ వినియోగదారుల పేరిట ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరిచిందన్న ఆరోపణలు వచ్చాయి. అలా తెరిచిన ఖాతాల్లో వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో పడే గ్యాస్ సబ్సిడీని ఈ ఖాతాల్లోకి మళ్లించింది. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన ఆధార్ అధికారులు ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్లను తాత్కాలికంగా రద్దు చేశారు. వినియోగదారుల అనుమతి లేకుండా ఖాతాలు తెరిచిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు మొత్తం 23 లక్షలమందికిపైగా ఖాతాదారులకు చెందిన దాదాపు రూ.47 కోట్లను జమచేసుకుంది.