ఎస్బీఐ నుంచి మరో గుడ్ న్యూస్!
Updated:
02-10-2017 08:39:34
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంకు తమ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఏడాది నిండిన సేవింగ్స్ ఖాతాలను రద్దు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదని ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. గతంలో పొదుపు ఖాతాను రద్దు చేసుకోవాలంటే రూ.500తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి వచ్చేది. అయితే ఖాతా ప్రారంభించాక రెండు వారాల్లోగా రద్దు చేసుకుంటే కనుక ఈ చార్జీలు ఉండేవి కాదు.
తాజాగా ఎస్బీ అకౌంట్ల రద్దుకు రుసుమును రద్దు చేసిన ఎస్బీఐ మృతి చెందిన వారి ఖాతాలను రద్దు చేసేందుకు వసూలు చేసే మొత్తాన్ని కూడా రద్దు చేసినట్టు వివరించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ నిర్వహించే రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే ఖాతాను ప్రారంభించి రెండు వారాలు గడిచాక, ఏడాది పూర్తి కాకుండా రద్దు చేసుకుంటే మాత్రం రూ.500, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.