కన్నుల పండువగా సాగిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. నిమజ్జనం పూర్తి
Updated:
05-09-2017 04:41:03
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తైంది. భారీ వాహనంపై ఉదయం 8 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలదాకా సాగింది. కన్నుల పండువగా సాగిన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ట్యాంక్బండ్కు చేరుకున్నాక మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ క్రేన్ సాయంతో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తితో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఉదయం 8 గంటలకే శోభాయాత్ర ప్రారంభించింది. భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు మహాగణపతి శోభాయాత్రలో పాల్గొని తరించారు. ట్యాంక్బండ్ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతిని భారీ క్రేన్ సాయంతో నిమజ్జనం చేశారు. వచ్చే ఏడాది నుంచి మట్టి గణపతిని నెలకొల్పుతామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఇప్పటికే తెలిపింది. శోభాయాత్ర నేపథ్యంలో నగరమంతటా 35 వేల మంది పోలీసులు పహారా కాశారు.