మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

తిరుమలలో ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

Updated: 18-12-2017 03:12:34

తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి టోకెన్ల జారీని ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన శకుంతలారామన్‌ అనే భక్తురాలి ఆధార్‌కార్డును స్కాన్‌ చేసి మొదటి టోకెన్‌ అందజేశారు.
 
 
 సమయ నిర్దేశిత సర్వదర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా ఆయా కౌంటర్ల వద్ద ఆధార్‌కార్డు చూపాల్సి ఉంటుంది. కౌంటర్ల వద్ద ఖాళీగా ఉన్న స్లాట్ల వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా మానిటర్లను ఏర్పాటుచేశారు. భక్తులు 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. టోకెన్‌ పొందిన అనంతరం అందులో సూచించిన సమయానికి ఎటిసి కార్‌ పార్కింగ్‌ ప్రదేశంలోని దివ్యదర్శనం కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టోకెన్లు తనిఖీ చేసి రూ.10/- చొప్పున 2, రూ.25/- చొప్పున 2 లడ్డూ టోకెన్లు అందిస్తారు. రెండు గంటల్లోపు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆధార్‌కార్డులు లేని భక్తులు పాత పద్ధతిలో సర్వదర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
 
 
 
 
తిరుమలలో టోకెన్ల జారీ కేంద్రాలు : 
 
 
 
కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలు, కౌస్తుభం విశ్రాంతిగృహం, సన్నిధానం, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి నగర్‌ కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ కౌంటర్‌, ఎంబిసి-26 లగేజి కౌంటర్‌, ఎటిసి, శ్రీ వరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గం, ఆళ్వారుట్యాంక్‌ వద్ద టోకెన్ల జారీ కౌంటర్లు ఉన్నాయి.
 
 
 
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తుల మనోగతం : 
 
 
 
సర్వదర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన రైతు విజయకుమార్‌ మాట్లాడుతూ డిసెంబరు 17న రూ.300/- దర్శన టికెట్‌ బుక్‌ చేసుకున్నామని, అనివార్య కారణాల వల్ల శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయామని చెప్పారు. తిరుమలలో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ వారి ప్రకటనలు విని సోమవారం ఉదయం ఆధార్‌ కార్డులు చూపించి మొత్తం 5గురు కుటుంబ సభ్యులకు టోకెన్లు పొందామన్నారు. భగవంతుడు ఇచ్చిన మరో అవకాశంగా భావించి ఉదయం 11 గంటల స్లాట్‌ను బుక్‌ చేసుకున్నట్టు తెలిపారు.
 
 
 
మహబూబ్‌నగర్‌కు చెందిన హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ తిరుపతి నుంచి తిరుమలకు బస్‌లో వస్తుండగా అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద శ్రీవారి సేవకులు కరపత్రాలు అందించారని తెలిపారు. కరపత్రాల ద్వారా విషయం తెలుసుకుని సర్వదర్శనం టోకెన్లు పొందామన్నారు. నిర్మల్‌కు చెందిన బి.మహేష్‌ మాట్లాడుతూ పత్రికల్లో వార్తలు చూసి సమయ నిర్దేశిత సర్వదర్శనానికి వచ్చినట్టు తెలిపారు. టివి చానళ్లలో కథనాల ద్వారా సర్వదర్వనం టోకెన్ల విషయాన్ని తెలుసుకుని వచ్చామని విజయనగరానికి చెందిన బి.యల్లాజి అనే భక్తురాలు చెప్పారు. తమిళనాడులోని కరూర్‌కు చెందిన రవిచంద్రన్‌ అనే భక్తుడు మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో మిత్రులు అందించిన సమాచారం మేరకు తిరుమలకు సమయ నిర్దేశిత సర్వదర్శనానికి వచ్చినట్టు తెలిపారు. 
 
 
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో ఆకే రవిక ష్ణ, ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్‌ ఇతర అధికారులు ఉన్నారు.
 
 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.