శుభవార్త చెప్పిన స్టేట్బ్యాంక్.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం
Updated:
28-02-2018 02:28:07
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్బ్యాంకు (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. పలు కాల వ్యవధులపై ఉన్న బేస్ పాయింట్లను 10 నుంచి 50 వరకు పెంచింది. 7-45 రోజుల కాల వ్యవధి మధ్య ఉన్న డిపాజిట్లపై ప్రస్తుతం 5.25 శాతం వడ్డీ రేటు ఉండగా దానిని 5.75 శాతానికి పెంచింది. ఏడాది కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 6.25 శాతం వడ్డీ రేటును 6.40 శాతానికి పెంచింది. రెండేళ్ల నుంచి పదేళ్ల కాల వ్యవధితో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. ఇదే కాలపరిమితి కలిగిన సినియర్ సిటిజన్ల (60 ఏళ్లు దాటినవారు) డిపాజిట్లపై అదనంగా మరో అరశాతం ఇవ్వనున్నట్టు అంటే 7 శాతం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అలాగే కొత్త డిపాజిటర్లకు, రెన్యవల్ ఖాతాదారులకు కూడా వర్తిస్తాయని వివరించింది.