అమెరికా తెలుగు సంఘాల మీట్ అండ్ గ్రీట్.. పాల్గొన్న భరణి, పోణంగి
Updated:
20-03-2018 11:01:01
అట్లాంటా: అమెరికాలోని గాంధీ ఫౌండేషన్ మరియు అమెరికా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 2018 మార్చి 17 వ తేదీ శనివారం సాయంత్రం అట్లాంటా లోని కింగ్ సెంటర్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మీట్ & గ్రీట్ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర, రంగస్థల నటుడు తనికెళ్ళ భరణి, ఆకాశవాణి & దూరదర్శన్ న్యూస్ రీడర్, వ్యాఖ్యాత పోణంగి బాల భాస్కర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియా ట్రిబ్యూన్ పత్రిక ఎడిటర్ రవి పోణంగి అతిధులను పరిచయం చేశారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన " వైష్ణవ జనతో ..." మరియు " రఘుపతి రాఘవ రాజారామ్ ...:" గీతాలను శిల్ప ఆలపించారు ...
గాంధీ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆంథోనీ థాలియాత్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. గాంధీ విగ్రహం ప్రతిష్టించి 20 సంవత్సరాలైందనీ , ప్రతీ ఏటా వివిధ దేశాలకు చెందిన దాదాపు ఒక మిలియన్ మంది ప్రజలు ఈ విగ్రహాన్ని సందర్శిస్తారని తెలిపారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ అహింసను వజ్రాయుధంగా చేసుకుని ఉద్యమాలు చేసిన ఇద్దరు మహా పురుషుల స్మారక కేంద్రాన్ని సందర్శించి వారికి నివాళులర్పించడం తన అదృష్టం గా భావిస్తున్నట్లు చెప్పారు .
పోణంగి బాల భాస్కర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో నల్లజాతీయులు విముక్తి కోసం పోరాడి విజయం సాధించడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
అనంతరం మార్టిన్ లూధర్ కింగ్ జూనియార్ సమాధి వద్ద అందరూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు .సమీపంలొ ఉన్న గాంధీ మ్యూజియం , కింగ్ జన్మించిన గృహం కింగ్ పనిచేసిన ప్రార్ధనా మందిరం (చర్చి ),కింగ్ సెంటర్ ను సందర్శించారు.