కోహ్లీ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా ఎదుట భారీ లక్ష్యం
Updated:
07-02-2018 08:38:05
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. 159 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 160 (నాటౌట్) పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (0) వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ శిఖర్ ధవన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధవన్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే (11), పాండ్యా (14), ధోనీ (10) కేదార్ జాదవ్ (1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు.
సహచరులు వెనుదిరుగుతున్నా కోహ్లీ మాత్రం క్రీజును అంటిపెట్టుకుని ఉన్నాడు. ఈ క్రమంలో కెరీర్లో 34వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జీన్ పాల్ డుమినీ 2, రబడ, క్రిస్ మోరిస్, ఫెహ్లుక్వాయో, ఇమ్రాన్ తాహిర్ చెరో వికెట్ తీసుకున్నారు.