అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి
Updated:
07-12-2017 08:39:03
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతిచెందాడు. బ్రిడ్జిఫోర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న నాగ తులసీరామ్ వాటర్బరీలో ఉంటూ యూనివర్సిటీకి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బుధవారం అమెరికా నుంచి హైదరాబాద్ సూరారంలో ఉండే నాగ తులసీరాం తండ్రి జాకబ్కు ఫోన్ వచ్చింది. నాగ తులసీరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఫోన్లో చెప్పారు. దీంతో విషాద సాగరంలో మునిగిపోయిన జాకబ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆశ్రయించారు. సాయం చేయాలని అభ్యర్ధించారు. వివేక్ మంత్రి కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. నాగ తులసీరాం మృతదేహాన్ని హైదరాబాద్ తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.