అమెరికా టెక్సాస్ చర్చిలో కాల్పులు.. 26 మంది మృతి
Updated:
06-11-2017 08:46:19
టెక్సాస్: అమెరికా మరోసారి నెత్తురోడింది. టెక్సాస్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్మాది కాల్పులతో విరుచుకుపడ్డాడు. 26 మందిని పొట్టనపెట్టుకున్నాడు. మరో 24 మందిని గాయపరిచాడు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉన్మాది హతమయ్యాడు. ఉన్మాది ఒకప్పుడు ఎయిర్ఫోర్స్ బేస్లో పనిచేశాడని, న్యూ మెక్సికోకు చెందిన వాడని తెలిసింది. ఉన్మాదిని డెవిన్ ప్యాట్రిక్ కెల్లీగా గుర్తించారు. మాస్క్ ధరించి అత్యాధునిక రైఫిల్తో వచ్చిన కెల్లీ ప్రార్ధనలు చేస్తున్నవారిపై ఏడు నిమిషాల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చూస్తుండగానే 26 మంది పిట్టల్లా రాలిపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో ఇటీవలే రెండు ఉగ్రదాడులు జరిగాయి. న్యూయార్క్, కొలరాడోలో జరిగిన దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ఇలా జరగడంతో అమెరికా వాసుల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్న సమయంలో ఇలా జరగడంతో నిఘా, భద్రతాి సంస్థలు అప్రమత్తమయ్యాయి. కాల్పులను ట్రంప్ ఖండించారు. భారత్ సహా అనేక ప్రపంచ దేశాలు కాల్పుల ఘటనను ఖండించాయి.